ఈ టపా చూడగానే అన్నం వండడం కూడా రాయాలా మాకు రాదా అనిపించొచ్చు. నేను కూడా ఇలాగే అనుకునేదాన్ని, ఏ బియ్యం అయితే ఏముంది అన్నమే కదా అని.బాగా శుద్ది చేసిన తెల్ల బియ్యం కంటే దంపుడు బియ్యం మంచిదని, అందులో ఉన్న కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్(పిండి పదార్థాలు) మెల్లగా శరీరానికి కావలసిన శక్తిని అందిస్తూ, శరీరంలో గ్లూకోస్ నిల్వలు ఒక్కసారిగా పెరిగేటట్లు చేయవు అని తెలుసుకొని వాడి చూద్దామని చాలా సంవత్సరాల క్రితం మొట్టమొదటి సారిగా దంపుడు బియ్యం కొన్నాను. మామూలుగా అన్నం వండినట్లే వండేశాను. అన్నం సహించలేదు, అస్సలు తినబుద్ది కాలేదు. మొదటిసారి కదా తినడం అందుకని అలాగే వుంటుందేమో అనుకుని సర్ది చెప్పుకున్నాను.రెండు మూడు రోజుల తర్వాత కూడా అదే పరిస్థితి, ఇక తినలేక మిగిలిన బియ్యాన్ని దోశలకు వాడి మొత్తానికి అవగొట్టేశాను. ఆరోగ్యానికి మంచిదంటారు కదా మరి ఎందుకు తినలేక పోతున్నాము అన్న ఆలోచన మాత్రం వదలకుండా వెంటాడేది. ఒకరోజు అనిపించింది వండడంలో ఏదైనా కిటుకు ఉందేమో అనిపించేది. అలా నెట్లో వెతగ్గా వెతగ్గా దంపుడు బియ్యాన్ని వండే విధానం కనపడింది. ఇక అప్పటి నుండి ఈ పద్దతిలోనే వండడం మొదలు పెట్టాను.
అన్నం వండుకునేందుకు ఒక పూట ముందుగా (అంటే మధ్యాహ్నానికి అన్నం వండుకోవాలంటే ఉదయాన్నే)సరిపడా బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
ఈ బియ్యంలో ఎక్కువ నీళ్ళుపోసి నానబెట్టుకోవాలి.
అన్నం వండే ముందు ఈ నీళ్ళలో నుండి ఒక సీసాడు నీళ్ళు తీసి ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి.
ఇక బియ్యాన్ని బాగా కడిగి ఒక గ్లాసుకు రెండు గ్లాసుల కొలతతో నీళ్ళు పోసి వండుకోవాలి.
మళ్ళీ అన్నం వండుకోవాలంటే బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి నానబెట్టుకునేముందు సీసాలో తీసి ఉంచుకున్న నీళ్ళు పోసి నానబెట్టాలి.
ఇలా ప్రతిసారీ వండే ముంది ఒక సీసా నీళ్ళు తీసిపెట్టుకోవడం, ఈ నీళ్ళను నానబెట్టే ముందు కలుపుకోవడం చేసుకోవాలి.ఇలా నీళ్ళు తీసి దాచుకోవడం వల్ల నీళ్ళు బాగా పులుస్తూ ఉంటాయి. ఇలా పులిసిన నీళ్ళలో నానబెట్టడం వల్ల ప్రోబయాటిక్ బాక్టీరియా పెరిగి అన్నం బాగా జీర్ణమవ్వడానికి తోడ్పడుతాయి.