నూడిల్స్ అంటే ఇష్టపడని పిల్లలు చాలా తక్కువ మందే ఉంటారు. ఈ నూడిల్స్ తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.కొన్న వాటి కంటే ఆరోగ్యకరం కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పైగా మనకు ఇష్టం వచ్చిన పిండితో చేసుకోవచ్చు. వీటిని నేను బార్లీ పిండితో చేశాను. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు:-
బార్లీ పిండి – మూడు కప్పులు
కూరగాయల ముక్కలు – 2-3 కప్పులు
వెల్లుల్లి – 2-3 రెబ్బలు
అల్లం – చిన్న ముక్క
సోయా సాస్ – 1 టేబుల్ స్పూన్
టొమాటో సాస్ – 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు – తగినంత
నీళ్ళు – సరిపడా
నూనె – 3-4 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి – తినే కారానికి సరిపడా
పొయ్యి మీద మంచి నీళ్ళు పెట్టి బాగా మరిగించాలి.
బార్లీ పిండిని వేడి నీళ్ళతో కలుపుకోవాలి.
కారాల పావుల్లో (జంతికల గొట్టం) ఈ పిండిని తీసుకొని నూడిల్స్ లాగా, ఇడ్లీ పాత్రల్లోకి వత్తుకోవాలి.
పిండి అంతా వత్తుకున్నాక, ఇడ్లీ ఉడికించినట్లు ఆవిరి మీద 10 నిమిషాలు ఉడికించాలి.
10 నిమిషాల తర్వాత వెడల్పాటి పళ్ళెంలో విడి విడిగా తీసి చల్లారనివ్వాలి.
కూరగాయలు సన్నగా తరుక్కోవాలి. నేను క్యారెట్, క్యాబేజ్, ఉల్లిపాయలు వేశాను. అల్లం, వెల్లుల్లి కూడా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి.
సోయా సాస్, టొమాటో సాస్ రెండు ఒక చిన్న గిన్నెలో కలిపి ఉంచుకోవాలి.
పొయ్యి మీద మందపాటి పాత్ర పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి.
వేగాక కూరగాయ ముక్కలు, ఉప్పు వేసి కొద్ది సేపు మగ్గనివ్వాలి. కూరగాయ ముక్కలు మరీ మెత్తగా మగ్గకుండా చూసుకోవాలి.
ఇప్పుడు సాస్ పోసి బాగా కలపాలి.
చల్లారపెట్టుకున్న నూడిల్స్ కూడా వేసి పెద్ద మంట మీద బాగా కలపాలి.
చివరలో అప్పుడే దంచిన మిరియాల పొడి వేసి కలిపి దింపేస్తే సరిపోతుంది.